ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు జగన్ ప్రకటించారు. మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు రావాలని ఆయన ఆహ్వానించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారని తెలిపారు.
ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అదనంగా 3 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడర్లు ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు సీఎం జగన్.
వివిధ ఉత్పత్తులకు సంబంధించిన తయారీ రంగంలో క్లస్టర్లు ఉన్నాయన్న ఆయన.. విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుందని ప్రకటించారు. విశాఖపట్నం వేదికగానే ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్.