ఖాకీ లాఠీకి బలైపోయిన ఖదీర్ ఖాన్ ను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నిరుపేదల బతుకులు మీ కుక్కల కన్నా.. హీనమా అని ఆయన తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్క పిల్లకు ఇచ్చే విలువను నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన ఇంట్లో హస్కీ అనే కుక్క పిల్ల చనిపోతే.. డాక్టర్ పై కేసు పెట్టిండని గుర్తు చేశారు. మెదక్ లో బహుజన బిడ్డ ఖదీర్ ఖాన్ ను పోలీసులు కొట్టి చంపినా దీనిపై కేసీఆర్ నోరు మెదపలేదన్నారు.
మీ కుక్క పిల్లల కన్నా నిరుపేద బతుకులు అంత హీనమా అని కేసీఆర్ ను ప్రశ్నిస్తూ.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఖదీర్ ఖాన్ మృతికి కారకులైన పోలీసు సిబ్బందిపై ఐపీసీ 302 కింద మర్డర్ కేసు నమోదు చేయాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
అనుమానం పేరుతో పోలీసులు పేదలపై బలప్రయోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం గొలుసు చోరీ అనుమానంతోనే గతంలో మరియమ్మ అనే మహిళను, ఇప్పుడు ఖదీర్ ఖాన్ లాంటి పేద బహుజనుల ప్రాణాలు తీస్తున్నారని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.