తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన సచివాలయ పనులను పరిశీలించారు. మంత్రులతో కలిసి వెళ్లిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న పనులు మినహా అంతా పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, కేబినెట్, సీఎంవో, అధికారుల ఛాంబర్స్ ను సిద్ధం చేశారు. సచివాలయ నిర్మాణ కోసం సిబ్బంది, కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వేద పండితులు సూచించిన మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభోత్సవం జరగనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం రోజే.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కూడా ఉంది. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు.
సచివాలయ ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన సచివాలయ ప్రారంభం జరగనుంది. ఈ వేడుకకు జాతీయ నేతలను కూడా ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొననున్నారు.
ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.