యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ములాయం జీవితాంతం బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేశారని కొనియాడారు. రాంమనోహర్ లోహియా వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.
భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ ములాయం సింగ్ యాదవ్ మరణంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. కుమారుడు అఖిలేష్ యాదవ్కు, ఆయన కుటుంబసభ్యులకు. ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు.
ఈరోజు ఉదయం ములాయంసింగ్ యాదవ్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.