కేసీఆర్ ప్రభుత్వ తీరు.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనను గుర్తుకు తెస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆ రోజు వైఎస్సార్ పాదయాత్ర చేసి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందన్నారు షర్మిల.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్దాలు చెప్తోందని విమర్శించారు. 24 గంటల విద్యుత్ విషయంలో కేసీఆర్, మంత్రులు చెప్పిన దానికి, వాస్తవానికి పొంతనలేదన్నారు. వ్యవసాయానికి కనీసం 7 గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రైతులు సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఓవైపు కరెంట్ కోసం అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిరంతర విద్యుత్ హామీతో రాష్ట్రంలో రైతన్నలు 50 లక్షల ఎకరాల్లో సాగు చేశారని వైఎస్ షర్మిల తెలిపారు.
ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి, మరో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 7 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో ఇతర అంతరపంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. కానీ కరెంట్ కోతలతో ఈ పంటలన్నీ ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే ఐదారు గంటల కరెంట్ తో చివరి మడి వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారని చెప్పారు వైఎస్ షర్మిల.