ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో కేసీఆర్ 3 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయంగా తీర్చిదిద్దుతామన్నారు. హనుమాన్ జయంతిని దేశంలోనే అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధి ఓ బృహత్తర ప్రాజెక్ట్. అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో పాటు, భక్తులకు సకల వసతులు కల్పించేలా కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. వేల మంది ఒకేసారి దీక్ష ధారణ, విమరణ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు.
దాదాపు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కేసీఆర్ చెప్పారు. పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, కోనేరులను అభివృద్ధి చేయడంతో పాటు 86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
వసతులు బాగుంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారన్న సీఎం కేసీఆర్.. కొండగట్టుకు మళ్లీ వస్తానని, ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అంతేగాక కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు.