సీఎం కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు పంటలను పరిశీలించనున్నారు సీఎం. పరకాల మండలం, నడికూడ మండలం, నర్సంపేట మండలాల్లో అకాల వర్షానికి పంట నష్టంపోయిన రైతుల పొలాదగ్గరకు వెళ్లి కలుస్తానని సీఎం చెప్పారు. అంతేగాకుండా.. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు.
తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచాయి. ఖరీఫ్ సీజన్ లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో దిగులుతో ఉన్న రైతులపై రబీ సీజన్ ప్రారంభంలో కురిసన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో మిర్చి పంటకు భారీ నష్టం జరిగింది. అకాల వర్షాలు హనుమకొండ జిల్లా రైతులకు కష్టాలు మిగిల్చాయి. మొక్కజొన్న రైతులు నష్టపోయారు. పంటలు నేలపాలయ్యాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.