వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా పంటలకు అపార నష్టం వాటిల్లిన జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. మంగళవారం లేదా బుధవారం వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని ఇప్పటికే సంబంధిత జిల్లామంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరనున్నారు. ఇదే విషయాన్ని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం విలువ రూ.1300 కోట్ల దాకా ఉంటుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులకు 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు పంట నష్టపోయారని తెలిపింది.
ఎక్కువగా మొక్కజొన్న… తర్వాత వరి, మిర్చి, వేరుశనగ, పత్తిపంటలు దెబ్బతిన్నాయి. మామిడి, టమోటా, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ సమూహాల వారీగా పంటనష్టంపై అధికారులు నివేదికలు రూపొందించారు.