ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దేవుళ్లను కూడా మోసం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సోమవారం రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ నాయకుడు మేడిపల్లి సత్యం కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోనే ప్రశస్థమైన దేవాలయం కొండగట్టు అని, అంజన్న ఆశీర్వాదం తీసుకొని 4 కోట్ల ప్రజలకు మేలు జరిగేలా కోరుకున్నానన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు. గుడిలో ఉన్న స్వామివారిని, పూజారులను, భక్తులను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి.. 125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రీ, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, కాపాడాలని కోరారు. గతంలో బస్సు ప్రమాదం జరిగి 70 మంది చనిపోయారన్న సీఎం.. బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. తూతూ మంత్రంగా ఆర్థిక సాయం చేశారని, ప్రమాదం జరిగిన చోట ఒక గోడ మాత్రం కట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తక్షణం రూ.500 కోట్లు విడుదల చేసి అభివృద్ధి మొదలు పెట్టాలని కోరారు. కొండగట్టు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం తమకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.