పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. అందుకు సంబంధించిన దిశానిర్ధేశం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ నివేదికలు అందించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించనున్నారు.
కేంద్రంపై పోరాడేందుకు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.