‘నీ వెనుక ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం’అని కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగు. అయితే ఈ డైలాగు మనుషుల కోసం కాదు కోడికోసం వాడింది ఓ మహిళ.
తన కోడిపుంజు కాళ్ళు విరగ్గొట్టారని పోలీసులను ఆశ్రయించింది,సదరు కోడికి న్యాయం చేయమని పోలీసులకు మొరపెట్టుకుంది. నాటు కోడికి పోలీసులు చేసే న్యాయం ఏమై ఉంటుందబ్బా..!? అనుకుంటున్నారా …!అనుకోవాలి ఎందుకంటే పోలీసు కూడా మనిషే కదా. అయితే వివరాల్లోకి వెళ్తే గౌరీ దేవి అనే మహిళకు ఓ కోడిపుంజు ఉంది.
ఆ కోడిపుంజు కాలును పక్కింటి వారు విరగ్గొట్టారు! దీంతో సదరు మహిళ న్యాయం కోసం ఇలా కోడిపుంజుతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బిహార్లో ఈ ఘటన జరిగింది. గౌరీ దేవి.. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పోలీస్స్టేషన్ పరిధిలోని బలువా ప్రెగ్వా గ్రామంలో నివాసం ఉంటోంది. అయితే కొన్ని రోజులగా పక్కింటి వారితో గౌరికి తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
దీంతో పక్కింటి వారే తన కోడిపుంజు కాలును విరగ్గొట్టారని గౌరి ఆరోపిస్తోంది. ఎవ్వరులేని సమయం చూసి వారు ఈ ఘటనకు పాల్పడ్డారని చెబుతోంది. మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు.
ఘటనపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు. పక్షుల చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు ‘’నా కోడిపుంజు ఇంటి నుంచి బయటకు వెళ్లటమే ఆలస్యం.. దానిని పక్కింటివారు కొడుతూ ఉండేవారు.
చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళన్న తేడాలేదు. నా కోడిపుంజుని కొట్టేవారు. ఎలాగైన నా కోడికి న్యాయం జరగాలి” అని గౌరీ దేవి పోలీసులను వేడుకుంది. ఇదే సమయంలో అక్కడ ఉన్న కొంత మంది గౌరీ దేవిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె చెప్పిన సమాధానాలతో అందరు అవాక్కయ్యారు.
‘కాలు విరిగిన కోడిపుంజుతో నువ్వేం చేస్తావ్? ప్లాస్టర్తో కోడిపుంజు కాలును అతికిస్తావా?’ అన్న ప్రశ్నకు.. ‘ దాన్ని ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటా’ అని గౌరి గౌరవంగా సమాదానం చెప్పింది.
ఈ కేసుపై మరి సాక్షం ఎలాగని మరో ప్రశ్న అడగ్గా.. ‘ఇప్పుడు వీడియో రికార్డ్ చేశారుగా దాన్ని చూపిస్తాను’ అని తెలిపింది. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.