కొంత మంది కక్కుర్తికి హద్దు పద్దు ఉండదు. వెర్రిమొర్రి కాలిక్యులేషన్స్ వేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్శహర్లో జరిగిన వింత ఘటన అలాంటిదే.
బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు యత్నించిన ఆ వ్యక్తికి ఈ దుస్థితి ఎదురైంది.
కోడిని దొంగిలించే క్రమంలో డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి రాత్రంతా బోనులోనే ఉండిపోయాడు. బయటికి రావడం కుదరకపోయేసరికి బోరున విలపించాడు. ఇది గమనించిన స్థానికులు బోనులో చిక్కుకున్న వ్యక్తిని తీసేందుకు యత్నించారు.
అయితే అతడిని బయటకు తీసేందుకు వారికి వీలుకాలేదు. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇనుప ఊచల డోర్ను తెరిచిన అధికారులు.. ఆ వ్యక్తిని బయటకు తీశారు.