ఫైన్ కట్టమన్న ట్రాన్స్ పోర్ట్ అధికారిపై కొబ్బరి బొండాల వ్యాపారి కత్తితో దాడిచేసిన సంఘటన కాకినాడలో కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన ఆ అధికారి ఆసుపత్రిపాలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరంలో దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలోని జెడ్పీ సెంటర్ వద్ద పెంటా వెంకట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వ్యాన్ను నిలిపి కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు.
అటుగా వచ్చిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావు వ్యాన్కు సంబంధించిన పత్రాలు చూపమని కోరాడు. తనిఖీల నిమిత్తం వ్యాన్ రికార్డులు, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలు చూపాలని, వాహనానికి ఇది వరకే పడిన ఫైన్ కట్టాలని ఇన్స్పెక్టర్ సూచించారు.
అయితే ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్ తన వద్ద ఉన్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఇన్స్పెక్టర్ చిన్నారావుపై దాడి చేశాడు.
అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైనా దాడికి దిగడంతో ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేక పోయారు. ఈ ఘటనలో రవాణా శాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్స్పెక్టర్ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు దుర్గాప్రసాద్ను అరెస్టు చేశారు.
ఈ ఘటన ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిందని, ప్రస్తుతం ట్రాన్స్ పోర్ట్ అధికారి చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.