ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9 వ విడత తెలంగాణకు హరితహారం, పోడుపట్టాల పంపిణీ, ఇళ్ల పంపిణీ పై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే నూతన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 21 రోజుల పాటు ఆ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయం ఆరో అంతస్తులో ఈ సమావేశం ప్రారంభమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు,ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.
అదే విధంగా మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా,రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. రోజుకు ఒక రంగం చొప్పున.. ఆయా రంగాల వారీగా ప్రగతి ప్రస్థానాన్ని వివరించేలా కార్యక్రమాలు రూపొందించారు. గ్రామ స్థాయి మొదలు.. రాష్ట్ర రాజధాని వరకు కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు.
అయితే ఉత్సవాల నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలను నిర్వహించాల్సిన తీరుతెన్నులపై వారికి వివరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల సమన్వయం ఇలా కీలక అంశాలపై ఈ సదస్సులో సీఎం చర్చిస్తారు. ఇక జూన్ 24 వ తేదీ నుంచి పట్టాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించాలనుకున్న సీఎం.. తరువాత నేరుగానే సదస్సు నిర్వహిస్తున్నారు.