తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ సమావేశమయ్యారు. ఆమెతో పలు అంశాలపై చర్చించారు పాల్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని అన్నారు. ఇంత అవినీతిని తాను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
కేసీఆర్ కు కళ్లు నెత్తికి ఎక్కాయని.. ఆయన అక్రమ పాలనను అంతం చేయడానికే తాను అమెరికా నుంచి వచ్చానని వ్యాఖ్యానించారు పాల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ చెప్పారని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు తానే తీసుకు వచ్చానని పాల్ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తానేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ విజయనగరం నుంచి వస్తే.. తాను విశాఖపట్నం నుంచి వచ్చానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితుల గురించి కేఏ పాల్ మాట్లాడుతూ.. ఏపీ అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. మరో ఇరవై ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ అప్పు తీరదని పాల్ పేర్కొన్నారు.