కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే.. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. తాజాగా మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, రేణుకా చౌదరి మహిళా కమిషన్ ను కలిశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం హేమంత బిశ్వ శర్మపై ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం అని గీతారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అనడానికి నోరెలా వచ్చిందని విరుచుకుపడ్డారు. తనపై నీచమైన కామెంట్స్ చేసినప్పటికీ.. రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనకపోవడం తన సంస్కారం అని కొనియాడారు.
మహిళలు అంటే బీజేపీ కి గౌరవం లేదన్నారు గీతారెడ్డి. నిజంగా గౌరవం ఉంటే అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. తన పరిధిలోకి రాదని.. కేంద్ర కమిషన్ కు పంపిస్తామని చెప్పారన్నారు గీతారెడ్డి.
సవాలుకు జవాబు లేక అసోం సీఎం పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి. ఖబడ్దార్ హేమంత బిశ్వ. ఇది ఆరంభం మాత్రమే.. మునుముందు చాలా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడవాళ్లను హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుల సెక్షన్ లో మార్పు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.