బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు విద్యార్థులు. వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
దీంతో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. దాని వలనే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు.
సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు భాజపా ఎంపీ సోయం బాపూరావు వస్తుండగా.. లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.