భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవకు ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న రాఘవకు గురువారం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వనమా రాఘవ కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని షరతులు విధించింది. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రతి శనివారం సంతకం పెట్టాలని ఆదేవించింది. షరతులు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
పాత పాల్వంచకి చెందిన మీ సేవ నిర్వాహకుడు నాగ రామకృష్ణ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జనవరి నెలలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటన అనంతరం రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు బయటపడ్డాయి. తమ చావుకు వనమా రాఘవే కారణమని బాధితుడు వీడియోలో పేర్కొన్నాడు. దీంతో రాష్ట్రం అంతా తీవ్ర దుమారం రేగింది.
తన తల్లి, అక్కతో ఉన్న ఆస్తి వివాదంలోకి వనమా రాఘవ ప్రవేశించి తనను మానసిక ఆవేదనకు గురిచేశాడని వాపోయాడు. భార్యను తన గదికి పంపాలని వేధించాడని ఆయన కన్నీరు పెట్టుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్ఠానం రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సెల్ఫీ వీడియోల ఆధారంగా పోలీసులు వనమా రాఘవను అరెస్ట్ చేసి ఈ కేసులో ఏ2గా చేర్చారు.
ఆ తర్వాత బాధితుడి తల్లి, అక్కను సైతం అరెస్ట్ చేయగా.. వారికి హైకోర్టు కొద్దిరోజుల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. అయితే.. రాఘవ బెయిల్ ఫిటిషన్ ని పలుమార్లు తిరస్కరించిన హైకోర్టు.. గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. దీంతో 61 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రాఘవకు విముక్తి లభించనుంది.