న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు కేసీఆర్ కృషిచేస్తున్నారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.
చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రంతో పాటు.. ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని అన్నారు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారని కొనియాడారు. హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు.
కేసులు త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరపడుతోందని పేర్కొన్నారు. రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని చెప్పారు రమణ. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు.
ఇటీవల హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారని.. ఆ సెంటర్ ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు.