నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ పై వేధింపులు నిజమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. శ్రీచైతన్య కాలేజీపై విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. గత నెల 28 వ తేదీన నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.
ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఐదు రోజుల పాటు విచారణ నిర్వహించింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. శ్రీచైతన్య కళాశాలలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్న విషయాన్నీ కమిటీ గుర్తించింది. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగ్ కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది.
ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని అభిప్రాయపడింది. శ్రీ చైతన్య కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్న విషయాన్ని పేర్కొంది. కానీ విద్యార్థులకు సర్టిఫికెట్లను చిన్న కాలేజీల పేరుతో జారీ చేస్తున్నారని గుర్తించింది. విద్యార్థుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అయితే శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
కాలేజీకి చెందిన కృష్ణారెడ్డి, రవి ఆచార్య, నవీన్ వంటి వారు వేధింపులకు పాల్పడినట్టుగా సాత్విక్ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ నలుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే సాత్విక్ కేసు విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. సాత్విక్ ఆత్మహత్యపై అధికారులు తప్పుల తడకగా నివేదికను అందించారు. ఉస్మానియా మార్చురీలో మృత దేహం ఉంటే గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాత్విక్ ను నార్సింగ్ లోని శ్రీచైతన్య కాలేజీలోనే జాయిన్ చేయించామని.. వేరే కాలేజీతో మాకు సంబంధం లేదని.. పోలీసులు న్యాయం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు ఈ కేసులో కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందించలేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. సాత్విక్ ఆత్మహత్య ఘటనలో ఎలాంటి తుది నివేదిక సిద్ధం కాలేదని తేల్చి చెప్పింది. ఈ రోజు ఆదివారం కావడంతో రిపోర్ట్స్ సమర్పించడం వీలు కాదన్న బోర్డు..కొన్ని మీడియా ఛానెలలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.