కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదానీ షేర్ల కుంభకోణంతో ప్రజా సంపద ఆవిరైందంటూ కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. అదానీ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికపై ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రారంభించారు. భట్టి విక్రమార్కతో పాటు పార్టీ నేతలు హనుమంతరావు, రోహిత్ చౌదరీ, చెన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, మల్ల రవితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వెళ్లారు.
ఈ క్రమంలో ఖైరతాబాద్ కి రాగానే కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పలువురు కార్యకర్తలు రాజ్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రాజ్ భవన్ వైపు వెళ్లే కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.
రాజ్ భవన్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఆందోళనకారులు అదుపులోకి తీసుకున్నారు. దేశ సంపద ప్రజలకు చెందేలా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. అదానీ లాంటి బడావ్యాపార వేత్తలకు దేశ సంపదను మోడీ దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే అదానీ అంశంలో విచారణ జరిపించాలని కోరారు. లేకపోతే ఈ ముట్టడిని రానున్న రోజుల్లో ఉద్రిక్తం చేస్తామని ధ్వజమెత్తారు.