డబ్బులు లేకపోతే ఎన్నికల్లో గెలవలేమని… చదువుకున్న గ్రాడ్యుయేట్లు కూడా డబ్బుకు ప్రలోభపడ్డారని మాజీ మంత్రి, కాంగ్రెస్ హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్ కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందన్నారు.
ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసిన చిన్నారెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎన్నికల్లో పోటీ చేశారు. తనకు 32వేల ఓట్లు మాత్రమే రావటంతో సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ కు గురయ్యారు.
ఇంటర్ చదివే పిల్లల ఫోటోలతో… నకిలీ సర్టిఫికేట్స్ తో ఓట్లు నమోదు చేశారని ఆరోపించిన ఆయన, కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదన్నారు. తన పలుకుబడి 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.
ఉద్యమంతో వచ్చిన కేసీఆర్ ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయటం చూస్తుంటే భవిష్యత్ లో ఆయన్ను ఎవరూ తట్టుకోలేరని… నాగార్జునసాగర్ లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు తట్టుకోగలరన్నారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డిలు శక్తికి మించి తనకు సహకరించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.