కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర ఓ మైలు రాయిగా నిలుస్తుందన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి మంత్రి కేటీఆర్కు లేదన్నారు. సోనియా గాంధీ భిక్షతోనే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తున్నారన్నారు.
దేశ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. దేశ ఐక్యతకు చేపట్టిన ఈ యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ చరిత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన చెప్పారు. ఈ నెల 23న రాహుల్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందన్నారు. దాదాపు 14 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు మహేశ్వర్ రెడ్డి.
రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ కు సంబంధించి.. కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని జరిగే మీటింగ్ లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు సాగే రాహుల్ జోడో పాద యాత్రలో లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు మహేశ్వర్ రెడ్డి.