దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయంగా పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ఎన్నికలకు కొన్ని వారాల ముందు తనకివ్వవలసిన సీటును.. నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కు ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ శనివారం బీజేసీ కండువ కప్పుకున్నారు. అనంతరం పంజాబ్ లోని మోగా నుండి చంఢీగడ్ లోని బీజేపీ ఆఫీస్ కు చేరుకున్న కమల్ మీడియాతో మాట్లాడారు..
ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం తనను అవమానించడమేనని కమల్ అన్నారు. రాష్ట్రంలో మరో స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధీష్టానం తనను కోరిందన్నారు. కాంగ్రెస్ తనని అవమానించినట్టు భావించి తిరస్కరించానని చెప్పుకొచ్చారు. మోగాను సందర్శించేందుకు సిద్ధూ సాహెబ్ వచ్చినప్పుడు కూడా మా ఇంటికి రాకుండా నేరుగా మాళవికా సూద్ ఇంటికి వెళ్లారన్నారు. కాంగ్రెస్ మాళవిక సూద్ ను ఎంపిక చేసుకోవడం పట్ల తనకెటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మోగా నుంచి తనకు సీటు ఇవ్వకపోవడమే బాధగా ఉందన్నారు. మాళవిక తనకు సోదరి లాంటిదని వ్యాఖ్యానించారు.
ఐతే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కేవలం సోనూ సూద్ సోదరి అయిన కారణంగా సీటు ఇచ్చారని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ వర్కర్ గా ప్రారంభించి.. శిరోమణి అకాలీ దల్ కంచుకోటను బద్ధలు కొట్టి.. మోగాలో కాంగ్రెస్ స్థాపనకు కఠోర శ్రమ పడ్డానన్నరు కమల్. దాదాపు 21 ఏళ్లగా కాంగ్రెస్ కు చేసిన సేవ పార్టీ పట్టించుకోలేదని వాపోయారు.
అయితే.. గత సోమవారం మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోగా అసెంబ్లీ స్థానం నుండి అభ్యర్ధిగా మాళవిక సూద్ ఇస్తున్నట్టు ప్రకటిస్తూ టికెట్ ను ఇచ్చింది.