రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రోజుకో విధమైన ఘర్షణలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల విషయంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. నేడు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సింగరేణి ఆధ్వర్యంలోని ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ఓబీ కాంట్రాక్టులపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.
టెండర్ అర్హతను కొద్ది మందికి ఉపయోగపడేలా పెట్టారని ఆరోపించారు. సింగరేణికి 20 వేల కోట్ల నష్టమొచ్చే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా కోల్ ఇండియా టెండర్లు ఆహ్వానిస్తే.. ఇక్కడ మాత్రం కొందరు వ్యక్తుల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.
కోమటిరెడ్డి ఆరోపణలను మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టుల కోసం కొందరు వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి ఆరోపణలు చేశారు. ఉన్న పదవులు అడ్డం పెట్టుకొని బేరాలు చేసుకొనే బేరగాళ్లు.. రాష్ట్రంలో తయారయ్యారంటూ మండిపడ్డారు.
చాలా ఏళ్లుగా సింగరేణిలో కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారో.. ఈసారి ఆ నిబంధనలనే అమలుచేసినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇతరులకు అవకాశం ఇవ్వకుండా చేసిన వాళ్లు.. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అదే జరుగుతోందనే భ్రమలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగదీశ్రెడ్డి.