ర్యాగింగ్ తట్టుకోలేక మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి మృతికి సంతాపం తెలిపారు. కాలేజీ యాజమాన్యం, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు.
ప్రీతి మరణం విషయంలో మట్టెవాడ పోలీస్ అధికారి, కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్ వోడీని నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలన్నారు జీవన్ రెడ్డి.
మరోవైపు రక్షిత అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా వేధింపులకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని తెలిపారు. ఈ కేసులో కూడా భూపాలపల్లి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.