తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆయన ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 9 జిల్లాల్లో కోడ్ అమల్లో ఉండగా మంత్రి మల్లారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించడంపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి కంప్లైంట్ చేసింది. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
గురువారం కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ప్రారంభించారు. కాసేపటికి అక్కడే ఉన్న మంత్రి మల్లారెడ్డి స్టేజిపైకి ఎక్కి కేసీఆర్ ను కొనియాడుతూ స్పీచ్ ఇచ్చారు.
ఎలక్షన్ నియమావళి అమల్లో ఉందని ఆర్డీఓ చెబుతున్నా పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించారు. కీసరలో జరుగుతున్నది జాతర అని దానికి ఎన్నికల కోడ్ వర్తించదని చెప్పారు.
ఈ క్రమంలో మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. ఆయనపై ఈసీకి కంప్లైంట్ చేసింది. ప్రతి ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించడం మంత్రి మల్లారెడ్డికి పరిపాటిగా మారిందని అందుకే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ ను కోరింది కాంగ్రెస్ పార్టీ.