– ధరణి తెచ్చింది బడాబాబుల కోసమే..
– ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాలేదు గానీ..
– ప్రైవేట్ వాళ్లకు భూములు ధారాదత్తం చేస్తున్నారు
– కేసీఆర్ వంద తరాలకు సరిపడా సంపాదించారు
– రైతులంటే ఎందుకంత చిన్నచూపు
– ధరణి రద్దే లక్ష్యం.. రైతులతో కలిసి ఉద్యమిస్తాం
– రచ్చబండలో రేవంత్ రెడ్డి
ధరణి తెచ్చింది పేద ప్రజల మేలు కోసం కాదని.. సీఎం కేసీఆర్ ని చెప్పుతో కొట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న రేవంత్.. టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ చెప్పింది చేయరని.. మందేసి మాట్లాడుతాడో, దిగిన తర్వాత మరచిపోతాడో తెలీదని సెటైర్లు వేశారు. భూ దందాలతో కేసీఆర్ వంద తరాలు తినే ఆస్తి సంపాదించారని ఆరోపించారు. చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని 2 వేల నోట్ల మీద కాలిస్తే ఇంకా మస్తు పైసలు మిగులుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ధరణి బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ధరణి అద్భుతమని, సర్వరోగ నివారిణి అంటూ కేసీఆర్ అభివర్ణించారని.. తీరాచూస్తే అదే పేదల బతుకుల్లో నీళ్లు పోస్తోందని ఆరోపించారు. ధరణి తీసుకురావడం వల్ల రైతుల జీవితాలు ఆగమయ్యాయని ఫైరయ్యారు. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ లో ధరణి మొదలు పెట్టి.. అక్కడ పేదలకిచ్చిన అసైన్డ్ భూమిని వివిధ కారణాలతో గుంజుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ లో కూడా డెవలప్ మెంట్ పేరుతో లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందన్నారు రేవంత్. ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాలకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి ప్రేమని కేసీఆర్ దూరం చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడో అమ్ముకున్న వారి పేరు మళ్ళీ ధరణిలో ప్రత్యక్షం అవుతున్నాయని.. ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాల వల్ల చాలామంది క్షణికావేశానికి గురై మర్డర్ కేసుల్ని మీద వేసుకోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్ పేరు చెప్పి భూముల జోలికి ఎవరైనా వస్తే.. తిరగబడాలని రేవంత్ రైతులకు సూచించారు. కేసీఆర్ మాయమాటలు ఎవరూ నమ్మరన్న ఆయన.. ధరణి రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల పేరుతో సీఎం కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ఇంతవరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ.. వేలాది ఎరకాల భూముల్ని మాత్రం ప్రైవేట్ వాళ్లకు కేసీఆర్ కట్టబెడుతున్నారన్నారు. నయా భూస్వాముల్ని సీఎం తయారు చేస్తున్నారని విమర్శించారు. వెయ్యి కోట్ల విలువ చేసే 15 ఎరకాల భూముని 300 కోట్లకే ఐకియాకు ఇచ్చారని తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోందని.. మరి నిమ్మజ్ లోని 512 ఎకరాల భూమి సంగతేంటని ప్రశ్నించారు రేవంత్. ఎవరో కమీషన్ ఇచ్చే రాజులకు భూములిస్తున్నారన్నారు. భూముల కోసమే తెలంగాణ గడ్డపై విప్లవం వచ్చిందని.. చాకలి ఐలమ్మ పోరాటం భూముల నుంచేనని గుర్తు చేశారు. గ్రామాల్లోని భూస్వాములకు తిరిగి భూములు కట్టబెట్టేందుకు ధరణి తెచ్చారని.. ఎమ్మార్వో ఆఫీసులో ఉండాల్సిన రికార్డులను కలెక్టరేట్ కు తెచ్చుకొని తనకు కావాల్సినట్టుగా కేసీఆర్ రికార్డుల్ని మార్పిస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ నిర్మాణం పేరుతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.