నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మహా శివరాత్రి జాతరను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా గుడి ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు.
ఎద్దుల పందాలను బీఆర్ఎస్ పందాలుగా మార్చారని ఆరోపించారు. రంగులరాట్నం నిర్వాహకులను బెదిరించి పోలీసుల మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ నాయకులు రూ.14 లక్షలు లంచం తీసుకున్నారని విమర్శించారు.
ఇలా చేయడం మంచి పద్ధతి కాదని ఉత్తమ్ సూచించారు. ప్రభల వద్ద కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన టైంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.