కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశ సపందను గౌతమ్ అదానికి ధారాదత్తం చేయడాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారని.. లోక్ సభ వేదికగానే ఆధారాలతో సహా వివరించారని, దీన్ని జీర్ణించుకోలేకనే బీజేపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని ఆరోపించారు.
సూరత్ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత ఉన్నత న్యాయ స్థానంలో అప్పీల్ చేసుకోవడానికి రాహుల్ కి 30 రోజులు గుడువు ఇచ్చిందని తెలిపారు. ఈలోపు హడావిడిగా రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించే నిర్ణయం జరిగిపోయిందన్నారు ఉత్తమ్. న్యాయ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేసిందన్నారు.
కర్ణాటకలోని కోలార్ లో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడితే గుజరాత్ లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించిందని, పరువు నష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిందన్నారు. అనంతరం వెంటనే లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
నిజానికి కర్ణాటకలో జరిగిన వ్యవహారంపై గుజరాత్ లోని సూరత్ కోర్టు తీసుకున్న నిర్ణయం, జడ్జి వెలువరించిన తీర్పు సహేతుకం కాదని, సూరత్ జడ్జి పరిధిలోకి రాని వ్యవహారమన్నారు. గతంలో ఇందిరా గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించిన పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, ఇప్పుడు బీజేపీకీ అదే ఎదురవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.