అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గురవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యుత్ కోతలపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
అయితే కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించడంతో కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిచడంతో సభ లోపల వెలుపల ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేశారు.
అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే 24 గంటల కరెంటులోను కోత పెట్టడం దారుణం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతుల సమస్యలపై గొంతుపోయేలా అరిచి, గీ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మరో వైపు క్రాప్ సీజన్ లో మాటిమాటికి కరెంటు పోతుందని ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నాణ్యమైన కరెంటు సరఫరా చేసి రైతులను కాపాడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై 16 వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతారవణం నెలకొంది.