కరోనా పంజా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటున్న తరుణంలో మరోసారి నేనున్నాను.. అంటూ పడగ విప్పుతుంది కరోనా. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో గురువారం నమోదైన కేసులే చెబుతున్నాయి.
రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 494 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారి నుంచి గురువారం 126 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,048 కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జీహెచ్ఎంసీలో కొత్తగా 315 కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోలిస్తే ఈరోజు రెట్టింపు కేసులు నమోదు అయ్యాయి. కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.
దీంతో కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.