ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. తగ్గినట్టే తగ్గి.. మరో వేరియంట్ రూపంలో ప్రజలను వణించడానికి సిద్దం అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇటీవల కొంత కాలంగా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా మళ్లీ పెరుగుతున్నాయని డబ్లుహెచ్ఓ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఖోవ్ పేర్కొన్నారు.
చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధ్ధృతి తీవ్రంగా పెరుగుతోందని.. పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ.. కేసులు భారీగా పెరుగుతున్నాయని మరియా ట్వీట్ చేశారు. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తిరగబడుతోందని పేర్కొన్నారు.
డబ్లుహెచ్ఓ గణాంకాల ప్రకారం మార్చి 7 -13 మధ్య ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు 8 శాతం పెరిగాయని తేల్చి చెప్పారు. దక్షిణ కొరియా, వియత్నా, జర్మనీ దేశాల్లో అత్యధికంగా పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించారు. అయితే.. వ్యాక్సిన్ లతో వ్యాధి తీవ్రత, ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందే తప్పా.. వైరస్ వ్యాప్తి తగ్గదని స్పష్టం చేశారు మరియా.
కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయా దేశాలను బట్టి భిన్నమైన పరిస్థితులు ఉంటాయని అన్నారు. కానీ.. మహమ్మారి మాత్రం ఇంకా అంతం కాలేదని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టులు, జీనోమ్ సీక్వెన్సింగ్ లు, వ్యాక్సినేషన్ ను మరింత పెంచాలని కోరారు. మహమ్మారి అంతం మనచేతుల్లోనే ఉంది అని మరియా ట్వీట్ చేశారు.