బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్షయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి దూరంగా ఉండనున్నాడు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. గత ఏడాది ఏప్రిల్ లో కూడా అక్షయ్ కరోనా బారిన పడ్డాడు.
వాస్తవానికి 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ రోజున పలువురు సినీ ప్రముఖులు ‘రెడ్ కార్పెట్’ మీద నడవనున్నారు. వారిలో మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, ఆర్ మాధవన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నయనతార, తమన్నా భాటియా, శేఖర్ కపూర్, సీబీఎఫ్సీ చీఫ్ ప్రసూన్ జోషి, రికీ కేజ్ రెడ్ కార్పెట్ తో పాటు.. ఆ లిస్ట్ లో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు.
తనకి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్షయ్ కుమార్ స్వయంగా ట్వట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘వాస్తవానికి 2022 కేన్స్ ఫెస్టివల్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. కానీ కోవిడ్ పాజిటివ్ రావడంతో పాల్గొనలేకపోతున్నాను. మీ టీమ్ మొత్తానికి @ianuragthakur శుభాకాంక్షలు. నిజానికి నేను అక్కడ ఉండే అవకాశాన్ని కోల్పోతున్నాను’ అని ట్వీట్ చేశాడు.
అక్షయ్ కుమార్ నటించిన కొత్త చిత్రం ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. ఈ సినిమా పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, వీరత్వం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ముహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని జూన్ 3న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.