శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో భారీ స్థాయిలో అవినీతి వెలుగు చూసింది. ఒక్క నెలలోనే లక్షల్లో గోల్ మాల్ జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఈ అవినీతి వెలుగు చూసింది. నవంబర్ లో లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ.42 లక్షల వ్యత్యాసాలు జరిగినట్లు గుర్తించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ లడ్డూ తయారీ సరుకులు సెకండ్ క్వాలిటీ దేవస్థానానికి సరఫరా చేస్తున్నారన్నారు.
మార్కెట్ రేట్ల కంటే అధికంగా దేవస్థానానికి సరుకులు ఇస్తున్నారని తమ అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు. లడ్డూ తయారీ అధిక రేట్ల సరుకుల విషయమై దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ప్రస్తుతం దేవస్థానానికి లడ్డూ తయారీ సరుకులు ఇస్తున్నకాంట్రాక్టు రద్దు చేయాలని గత నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో బోర్డు ఆమోదం తెలిపిందని చైర్మన్ తెలిపారు. కానీ ఇంతవరకు కాంట్రాక్టు రద్దు కాలేదన్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్టు రద్దు చేయలేదని ఈవో లవన్న చెప్పారన్నారు.
శ్రీశైలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు పోల్చి చేసుకుంటే కనీసం కోటి రూపాయలు తేడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు చైర్మన్ చక్రపాణి రెడ్డి.