నకిలీ పత్తి విత్తనాలను అమ్మేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.85 లక్షలు విలువ చేసే బీజీ-3,హెచ్ టీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాల దందాను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఇటీవల డీజీపీ అంజనీ కుమార్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల అమ్మకంపై ప్రత్యేక నిఘా ఉంచారు.
బాలా నగర్, రాజేంద్రనగర్ ఎస్ వోటీ బృందాలు, బాచుపల్లి, బాలానగర్, షాబాద్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్ట్ చేసి 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా పట్టుబడ్డ నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నాయని, దీంతో వారిపై పీడీ యాక్ట్ పెడతామని వెల్లడించారు పోలీసులు. తక్కువ ధరకు విత్తనాలు అమ్ముతున్నారని ఆశ చూపితే రైతులు మోసపోవద్దని కోరారు. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే బిల్ తీసుకొని విత్తనాలను కొనాలని సూచించారు.