చుట్టూ మంటలు, దట్టమైన పొగలతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ప్రాణభయంతో ఉరుకులు, పరుగులు తీస్తున్న జనం. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులు ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవ దహనమయ్యారు. అయితే, అగ్నిప్రమాదాన్ని చూసిన కొందరు స్థానికులు ఫైరింజన్లు రావడానికి ముందే సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిలో క్రేన్ డ్రైవర్ ఒకరు. భవనం మొత్తం మంటలు వ్యాపించడానికి ముందే అతను 50 నుంచి 55 మందిని రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరిగ్గా ఇదే సమయంలో ముంద్కా ఉద్యోగ్ నగర్ నుంచి దయానంద్ తివారీ అనే క్రేన్ డ్రైవర్ అటుగా వెళ్తున్నాడు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే క్రేన్ యజమాని, ఓ అసిస్టెంట్తో సహా వెంటనే అగ్నిప్రమాదం జరిగిన భవనం దగ్గరకు చేరుకుని వారిని రక్షించే కార్యక్రమం మొదలుపెట్టారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోగా దాదాపు 50 మంది ప్రాణాలు వీరు కాపాడారు. మరింత మందిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించటంతో వీరి వల్ల కాలేదు. అగ్నిమాపక యంత్రాలు ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఆలస్యంగా చేరుకున్నాయని.. లేదంటే అంత విషాదం జరిగేది కాదని దయానంద్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతని సాహసం, మానవత్వంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు.. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. అటు ఈ ఘోర విషాదానికి కారణమైన భవన యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, రెండు రోజులుగా పరారీలో ఉన్న యజమాని మనీశ్ లక్రాను ఢిల్లీ, హరియాణాలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది మహిళలు సహా మొత్తం 27 మంది సజీవదహనం కాగా.. మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.