2022లో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని వెల్లడించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో 4.44 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయన్నారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్ కౌంటర్లు జరిగాయని, ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు వివరించారు. వారి నుండి 14 ఆయుధాలు, రూ.12,65,000 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కన్విక్షన్ రేట్ 50% నుండి 56% పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడిందన్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామన్నారు. 431 మందిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో షీ టీమ్స్ కి 6,157 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 2,128 కేసులు నమోదు చేశామన్నారు. డయల్ 100కి 13 లక్షల 77 వేల 113 కాల్స్ వచ్చాయన్నారు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను చేధించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షా 42 వేల 917 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు పేర్కొన్నారు. 13,895 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 938 జీరో FIR కేసులు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం 762 హత్యకేసులు, 2,126 రేప్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 1176 మాదక ద్రవ్యాల కేసులు నమోదవ్వగా.. 2,582 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2,432 పొక్సో కేసులు నమోదయ్యాయి.
2022లో 24,127 దోపిడీ కేసులు, రూ.148 కోట్ల దోపిడీ జరగగా అందులో రూ.74 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. 19,456 రోడ్ యాక్సిడెంట్స్ జరుగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశామన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.612 కోట్ల రూపాయల జరిమానాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలు ఉండగా.. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 2022లో 7లక్షల 66 వేల పెటీ కేసులు వచ్చాయని వెల్లడించారు డీజీపీ మహేందర్ రెడ్డి.