ప్రముఖులకు భద్రత కల్పించే విషయమై పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాయిని.. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీఐపీ లకు భద్రతా సిబ్బందిని తొలగిస్తూ మార్చి 12న పంజాబ్ ప్రభుత్వం మొదటిసారి ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇటువంటి ఆదేశాలను ఇస్తూనే వస్తోంది. దీంతో చాలా మంది భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కొద్ది మంది వీఐపీల కన్నా 2.75 కోట్ల మంది ప్రజలు తమకు చాలా ముఖ్యమని తెలిపారు.
అందులో భాగంగానే గాయకుడు సిద్ధూ మూసేవాలాకు కల్పించిన భద్రతను మే 26న రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అయితే.. అంతకుముందు నలుగురు పోలీసులు ఆయనకు భద్రత కల్పించేవారు. దీనిని ఇద్దరు పోలీసులకు కుదించారు. మే 29న సిద్ధూ దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే.. భద్రతను కుదించిన మరుసటి రోజే హత్య జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ సోనీ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రతను కుదించడాన్ని సవాల్ చేశారు. దీనిని విచారణకు చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఓ వ్యక్తికి గల భద్రతా సంబంధమైన ముప్పును ఏ విధంగా అంచనా వేస్తారో చెప్పాలని ఆదేశించింది. వీఐపీలకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ప్రజా బాహుళ్యానికి తెలిసేవిధంగా ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం స్పందిస్తూ.. ఆపరేషన్ బ్లూస్టార్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు గుర్తుగా జూన్ 6న ఘల్లుఘర దినాన్ని నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత మళ్ళీ 424 మంది వీఐపీలకు భద్రతను ఈ నెల 7 నుంచి పునరుద్ధరిస్తామని చెప్పింది. శాంతిభద్రతల అవసరాల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికపై మాత్రమే వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తున్నామని పేర్కొంది.
కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సునీల్ జక్కర్ ఇచ్చిన ట్వీట్ లో, ఎవరు అబద్ధం ఆడుతున్నారు భగవంత్ మాన్ గారూ? అని నిలదీశారు కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్ధమాడుతోందా? పంజాబ్ ప్రభుత్వం అబద్ధమాడుతోందా? అని నిలదీశారు. వీఐపీలకు భద్రతను ఎందుకు ఉపసంహరించారు? ఎందుకు పునరుద్ధరిస్తున్నారు? ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు అమరీందర్ సింగ్.