సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ క్యాంపులపై కాల్పులకు తెగబడ్డారు. అయితే, అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల దాడులను తిప్పికొట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, జవాన్లకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
వివరాల్లోకి వెళ్లితే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తోగుడెం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఆదివారం మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు జవాన్ల మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయి.
మరోవైపు ఈ దాడి జరిగిన రెండు గంటల వ్యవధిలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపుపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులు రాకెట్ లాంచర్లను వినియోగించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.
అయితే, పక్క పక్కనే ఉన్న రెండు సరిహద్దు రాష్ట్రాల్లో మావోయిస్టులు రెండు గంటల వ్యవధిలో రెండు పోలీస్ క్యాంపులపై దాడికి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలకు సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.