– మూడు సర్వీసులు ఖరారు
– జూన్ 8, 15, 22 తేదీలు ఫిక్స్
– ఎంప్రెస్ పేరుతో విహార నౌక
– 1500-1800 మంది వరకు ప్రయాణించవచ్చు
– ఎలాంటి పాస్పోర్టు అవసరం ఉండదు
– టికెట్ విక్రయాలకు నౌకాశ్రయానికి సంబంధం లేదు
– విశాఖ నౌకాశ్రయం ఛైర్మన్ కె.రామమోహనరావు
విశాఖ నగర వాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్ అనే పేరుగల నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి మళ్లీ విశాఖకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ నౌకలో విహరించాలనుకునేవారు ఎంచుకునే సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ సర్వీసు నడపడానికి నౌకాశ్రయ అధికారులను జేఎం భక్షి సంస్థ ప్రతినిధులు సంప్రదించగా.. వారు ఆమోదముద్ర వేశారు. సుమారు 1500-1800 మంది వరకు ఇందులో ప్రయాణించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు విహరించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు అధికారులు.
పాస్పోర్టు అవసరం లేదు:
మొదటి సర్వీసు జూన్ 8న ఉదయం ప్రయాణికులతో రానుంది. అందులోని ప్రయాణికులు విశాఖలో సాయంత్రం వరకు విహరిస్తారు. ఆ నౌక విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి.. ఈ నెల 9న మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10న ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడుగంటల వరకు పర్యటించనుంది. కాగామ నౌకలో ప్రయాణించే వారికి కావల్సిన ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు చెన్నైకు చేరుకుంటుంది. ఎంప్రెస్ విదేశీ విహార నౌక అయినప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో నౌకలో విహరించేందుకు ఎలాంటి పాస్పోర్ట్ అవసరం లేదని.. కస్టమ్స్ తనిఖీలు ఏం ఉండవని అధికారులు తెలిపారు.
నౌకలో అబ్బురపరచే పలు వసతులున్నాయి. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈతకొలను, ఫిట్నెస్ కేంద్రం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం వేళల్లో పలు కార్యక్రమాలను వీక్షించే సదుపాయం ఉంది. కాసినోను చూడడానికి అధికారుల అనుమతి కూడా ఉండటం గమనార్హం. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నగదు చెల్లించి భోజనం చేయడానికి నౌకలో కొన్ని రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. మద్యం, స్పా సర్వీసులు, కాసినోలో క్రీడలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వివరించారు.
అయితే.. విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం వచ్చే నౌకకు కొన్ని ప్రత్యేకతలున్నాయంటున్నారు అధికారులు. ఇంటీరియర్ స్టాండర్డ్ రూం, ఓషన్ వ్యూ స్టాండర్డ్ రూం, మినీ సూట్ రూం, సూట్ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించినట్టు తెలిపారు. అదే నౌక మరో రెండు సార్లు రానున్నట్టు వెల్లడించారు. అందుకు సంబంధించి జూన్ 15, 22 తేదీలను ఖరారు చేశారు.
విశాఖ నగరానికి వచ్చేనెల 8న అతిపెద్ద క్రూయిజ్ వస్తోందని తెలిపారు విశాఖ నౌకాశ్రయం ఛైర్మన్ కె.రామమోహనరావు. నౌకాశ్రయంలోకి రావటానికి దానికి అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇతర శాఖల అధికారులకు కూడా సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. భారత సాగరతీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారని తెలిపారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కె.రామమోహనరావు.