కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి టీ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. సునీల్ కనుగోలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మంగళవారం నాడే సీసీఎస్ ముందుకు వచ్చిన మల్లు రవి.
మంగళవారం నాడే మల్లు రవికి నోటీసులు అందించిన సైబర్ క్రైమ్ పోలీసులు. 41 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు ఈ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న సమాచారం తీసుకురావాలని కోరారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలును విచారించిన సంగతి తెలిసిందే.
గంటకుపైగా సునీల్ కనుగోలును విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనకు సంబంధించిన విచారణకు పూర్తిగా సహకరిస్తామని మల్లు రవి గతంలోనే స్పష్టం చేశారు. 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేసేందుకు ఏర్పాటు చేసిన వార్ రూమ్కు తానే ఇంచార్జ్గా ఉన్నానని చెప్పారు.
ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాసిన మల్లు రవి.. ‘‘నేను వార్రూమ్కు పర్యవేక్షకుడిగా ఉన్నాను. అక్కడ చేపట్టే అన్ని రాజకీయ కార్యకలాపాలు నా పర్యవేక్షణలోనే జరుగుతాయి’’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసినా దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలాన్ని తీసుకోలేదని.. కేసుతో సంబంధం లేని వ్యక్తులను పిలుస్తున్నారని మల్లు రవి ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారానికి సంబంధించి లాజికల్ ముగింపు తీసుకురావడానికి తాను దర్యాప్తులో చేరాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖులను కించపరిచేలా పోస్టింగ్లు చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు.. మాదాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, శ్రీప్రతాప్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పేర్కొన్న పోలీసులు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు.