తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న డేటా లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా 66 కోట్ల మంది వ్యక్తి గత డేటా లీక్ చేసిన కీలక సూత్రధారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల వ్యక్తిగత డేటాను తస్కరించేందుకు 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో ఏకంగా 4.45 లక్షల మది ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 4 కోట్ల మంది డేటాను చోరీ చేయగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2.5 కోట్ల మంది, హైదరాబాద్ కి చెందిన కోటి మంది డేటాను వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులని సమాచారం.
డీమార్ట్, నీట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్, బైజూస్ , వేదాంత , ఇన్కం ట్యాక్స్, డిఫెన్స్ అధికారులతో పాటు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటాను ఈ గ్యాంగ్ చోరీ చేసినట్లుగా గుర్తించారు.
జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్లతో పాటు జస్ట్ డయల్కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే మరోసారి సైబరాబాద్ పోలీసులతో కేంద్ర వర్గాలు భేటీ అయ్యాయి. డిఫెన్స్, నేవీ, ఆర్మీ ఆఫీసర్ల డేటా లీక్పై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా లీక్ కేసులో రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు.