ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం ఆన్ లైన్ లో అదనపు ఆదాయం సంపాదించాలనుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు అతని వద్ద నుంచి ఏకంగా 2.5 లక్షల రూపాయలు దోచేశారు.ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది.
బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధి డీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్.. గచ్చిబౌలి ఇన్ఫోసిస్లో అడ్మిన్గా పని చేస్తున్నాడు. అయితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయ సంపాదన కోసం ఆన్లైన్లో ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే ఫేస్బుక్లో ఉన్న ఓ లింక్ను ఓపెన్ చేశాడు. అంతే.. వెంటనే వాట్సాప్ ఓపెన్ అయి.. మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తెలపాలంటూ ఓ మెసేజ్ ఉంది. అందులో ఉన్నట్లుగానే శ్రీనివాస్ తన మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తెలిపాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి సూచించిన ఓ పోర్టల్లో లాగిన్ అయ్యాడు.
ఆ తర్వాత వారు సూచించిన మేరకు రూ.500 వేసి ఓ గేమ్ ఆడితే.. రూ.500 గెలుచుకున్నట్లు శ్రీనివాస్ ఖాతాకు నగదు పంపారు. దీంతో నమ్మకం పెరిగిన శ్రీనివాస్.. అప్పటి నుంచి పలు దఫాలుగా వారు సూచించిన మేరకు రూ.2.5 లక్షలు జమ చేసి పలుమార్లు గేమ్ ఆడాడు.
అయితే రూ.6.53 లక్షలు ఆదాయం వచ్చినట్లు పోర్టల్లో చూపింది కానీ ఇతని ఖాతాకు నగదు రాకపోవడంతో అనుమానం వచ్చి గేమ్ ఆడటం ఆపేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.