బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మాండూస్’ తీరం దాటింది. దీంతో తీర ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య ఉన్న మహాబలిపురం సమీపంలో ఈ తీవ్ర తుపాను తీరం దాటింది.
నిన్న ఉదయమే బలహీనపడిన తుపాను నేటి ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. మాండౌస్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కోస్తా, రాయలసీమల్లోని పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.
కాగా, తుపాను ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
అటు తుపాను ప్రభావంతో తమిళనాడులోని కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. పెనుగాలుల కారణంగా చెన్నైలో చెట్లు విరిగాయి.
చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాలు నిన్న రద్దయ్యాయి. చెన్నైతోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాను కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృత్యవాత పడ్డారు.