మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులకు ఊరట లభించింది. మేడ్చల్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మొత్తం ఏడుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన మన్నూరు రవి, అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మధుసూదన్ రాజు చర్లపల్లి జైలు నుంచి ఉదయం రిలీజ్ అయ్యారు. ఈ కేసులో మార్చిలో అరెస్ట్ అయిన ఏడుగురు 34రోజుల పాటు జైలులో ఉన్నారు. చేయని తప్పుకు తమను జైలుకు పంపారని నిందితులు వాపోతున్నారు.
శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఏడుగుర్ని పోలీసులు మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనేక అనుమానాలు తెరపైకి వచ్చినా.. పోలీసులు మాత్రం తమ పని తాము చేసేశారు. ఈ నేపథ్యంలో నిందితులు రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
మొదటిసారి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. రెండోసారి వేసిన పిటిషన్ పై మార్చి 15న విచారణ జరిగింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాంకేతిక ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వర్గాల వాదనల తర్వాత తీర్పును 31కి వాయిదా వేసింది కోర్టు. ఈ నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పును వెలువరించింది న్యాయస్థానం.