నాన్ బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్ విషయంపై ఢిల్లీ సీఎం,ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది పొలిటికల్ ప్లాట్ ఫామ్ కాదని గవర్నెన్స్ ప్లాట్ ఫామ్ అని ఆయన వెల్లడించారు. ఫ్రంట్ విషయంలో తాము పంపిన ఆహ్వానానికి ఏడు రాష్ట్రాల సీఎంల నుంచి స్పందన కరువైందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తనతో సహా 8 మంది సీఎంలు ఓ గవర్నెన్స్ బాడీగా ఏర్పడాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఇందులోని ఎనిమిది రాష్ట్రాల సీఎంలు ప్రతి నెలా ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. సీఎంలు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తమ రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తారని వివరించారు.
తెలంగాణలో కంటి వెలుగు పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పథకాన్ని ఢిల్లీ, పంజాబ్లో ప్రారంభిస్తామని తాను గతంలోనే చెప్పానన్నారు.. ఇలాంటి కార్యక్రమాలను పరిశీలించి వాటి గురించి అధ్యయనం చేసి అవగాహన పెంచుకునేందుకే ఈ ప్లాట్ పామ్ అని చెప్పారు.
ఈ గ్రూప్ తొలి సమావేశం ఈనెల 18న జరగాల్సి ఉందన్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో సమావేశ తేదీని మార్చామన్నారు. ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (జీ8) పేరుతో ఈ ప్లాట్ ఫామ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జీ8 ప్లాట్ ఫామ్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది.