ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో భాగంగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ పై రౌస్ ఎవెన్యూలోని సీబీఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితులను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ తో పాటు సప్లిమెంటరీ చార్జ్ షీట్ వారం రోజుల్లో నిందితులకు అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.
అయితే లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సమీర్ మహేంద్రును అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కిడ్నీలో రాళ్లు ఉన్నందున సర్జరీ కోసం బెయిల్ ఇవ్వాలని సమీర్ కోరారు.
ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ మహేంద్రుకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేస్తున్నామన్నారు. అతని చికిత్సను తాము అడ్డుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. కానీ పిటీషనర్ సమస్య అంత తీవ్రమైనది కానందున బెయిల్ నిరాకరించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.
అనంతరం సమీర్ మహేంద్రును తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ.. కస్టడీలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, సర్జరీ చేయాల్సి ఉన్నా తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని చెప్పారు. ఒకవేళ సర్జరీ చేయించుకోవడానికి బెయిల్ ఇచ్చినప్పటికీ అతను కేసుకి సంబంధించిన విషయాలు చెప్పడానికి అందుబాటులో ఉంటారని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పు ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు.