ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిజినెస్ మ్యాన్ శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బినోయ్ బాబు, శరద్ చంద్రారెడ్డి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసింది.
దీంతో వారిద్దరినీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టులో హాజరు పరిచారు సీబీఐ అధికారులు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ సెలవులో ఉన్నందున.. ఇద్దరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో జడ్జి వికాస్ ధుల్ ఎదుట ప్రవేశపెట్టారు.
శరత్ చంద్రారెడ్డిపై విచారణ పెండింగ్లో ఉందని, ఆయనపై ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. బినోయ్బాబు, శరత్ చంద్రారెడ్డిల జ్యుడీషియల్ కస్టడీ గడువును డిసెంబర్ 19 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో కేసు తదుపరి విచారణ జరుగుతుందని తెలిపారు.