రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరుసగా మూడోరోజుకు చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు రాజధాని ప్రజలు మెట్రో స్టేషన్ లోని అండర్ గ్రౌండ్ తలదాచుకుంటున్నారు.
ఈ భీకర యుద్ద వాతావరణంలో ఆసుపత్రులు అందుబాటులో లేక ఓ గర్భిణి తలదాచుకుంటున్న అండర్ గ్రౌండ్ లోనే ప్రసవించింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దానిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది.
కాగా.. మెట్రో స్టేషన్లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు.. ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయినప్పటికీ.. స్థానికులు ఫ్లాట్ ఫారాలను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
మరోవైపు ఉక్రెయిన్ లోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత ప్రజలను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది.
ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారుతోంది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ ఎముకలు కొరికే చలికి వణుకుతూ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.